తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్.. హెల్త్ కార్డులు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్.. హెల్త్ కార్డులపై ప్రభుత్వ సానుకూలత
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయింపు, నెలవారీ పెన్షన్ అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వెల్లడించింది.
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జేఏసీలతో నిర్వహించిన సంప్రదింపుల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని వారు కోరారు.
తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు కమిటీ తెలిపింది. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించింది.
గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యమకారులకు అందించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.