తెలంగాణకు యూరియా అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. సరిహద్దు చెక్పోస్ట్లో అధికారుల ఆకస్మిక తనిఖీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు యూరియా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు సమీపంలోని చెక్పోస్ట్ను విస్సన్నపేట మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపీడీవో చిన్న రాట్నాలు, వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి సంయుక్తంగా పరిశీలించారు.
చెక్పోస్ట్లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, వాహనాల తనిఖీ విధానాలను సమీక్షించిన అధికారులు, యూరియా అక్రమ రవాణాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ ఎరువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. రైతులకు అందాల్సిన యూరియా దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.