తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు? భారీ మార్పులకు సీఎం రేవంత్ కసరత్తు
వారం, పది రోజుల్లో విస్తరణకు అవకాశం.. మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్త వారికి ఛాన్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో వారం నుంచి పది రోజుల్లోగా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులపై వేటు, మరికొందరి శాఖల మార్పు, కొత్త వారికి అవకాశం కల్పించే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే స్పీకర్ పదవి ఖాళీ కానుంది. ఆ స్థానాన్ని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్కు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణతో పాటు స్పీకర్ మార్పు, శాఖల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ మార్పులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.