తెలుగు అధ్యాపకురాలికి పీహెచ్డీ ప్రదానం లోపూడిలో ఆనందోత్సాహాలు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన తెలుగు అధ్యాపకురాలు యలమర్తి సునీత పీహెచ్డీ పట్టా అందుకోవడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ముసునూరు జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ వరికూటి ప్రతాప్ సతీమణి అయిన సునీత ప్రస్తుతం బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.వి. కృష్ణారావు మార్గదర్శకత్వంలో “మేరీ కృపా బాయి – కథా నీరాజనం – పరిశీలన” అనే అంశంపై ఆమె పరిశోధన పూర్తి చేసి థిసిస్ సమర్పించారు. సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సునీత పీహెచ్డీ పట్టాను స్వీకరించారు.
మారుమూల గ్రామానికి చెందిన అధ్యాపకురాలు ఉన్నత విద్యలో ఈ ఘనత సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు సునీతను అభినందిస్తూ ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.