తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
లెక్కల్లో లేని రూ.2.48 లక్షల నగదు స్వాధీనం.. రికార్డుల పరిశీలన
తిరుపతి సిటీ: తిరుపతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు.
సాయంత్రం సమయంలో ప్రారంభమైన తనిఖీలతో కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లలో ఆందోళన నెలకొంది. కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో నమోదు కాని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదుకు సంబంధించిన వివరాలపై సబ్రిజిస్ట్రార్ లక్ష్మీదేవిని అధికారులు విచారించారు. అలాగే రిజిస్ట్రేషన్ రికార్డులు, దస్తావేజులు, నగదు లావాదేవీల వివరాలను పరిశీలించారు.
తనిఖీల సమయంలో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లను కూడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సోమవారం జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సైతం ఏసీబీ అధికారులు పరిశీలించారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.