తిరువూరులో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
తిరువూరు: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరువూరు పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ ఆధ్వర్యంలో శ్రీనిధి జూనియర్ కళాశాల, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, బస్టాండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. బస్టాండ్లోని మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్ను ఆర్డీవో ఏ. కుమార్ పరిశీలించారు. వాటి పరిశుభ్రత, నిర్వహణపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. బస్టాండ్ వెలుపల ఔట్ గేట్ సమీపంలోని దుకాణాల నుంచి చెత్తను రోడ్డుపై వేస్తున్నారన్న సమాచారంతో ఆయా దుకాణాలను తనిఖీ చేశారు. చెత్తను రోడ్లపై వేయకుండా దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని దుకాణదారులకు సూచించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని మున్సిపల్, సచివాలయ సిబ్బందికి ఆర్డీవో సూచించారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నగరపంచాయతీ మున్సిపల్ కమిషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.