వనమారెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం: పెద్దకొమిర పంచాయతీ శివారు వనమారెడ్డిగూడెం గ్రామంలోని 91వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం జాతీయ పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. సీజన్లో లభించే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. చిన్నారుల ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శోభ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ స్వామి, అంగన్వాడీ కార్యకర్త కె. కుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు పాల్గొన్నారు.