తిరువూరు–మధిర రహదారి గోతులమయం.. ప్రయాణికుల అవస్థలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం
తిరువూరు–మధిర ప్రధాన రహదారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. పీటీ కొత్తూరు నుంచి చింతలపాడు, గంపలగూడెం వరకు రహదారి పలుచోట్ల పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి.
గోతుల్లో పడి ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాలు పడిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న పాలకుల దృష్టికి ఈ రహదారి దుస్థితి ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఇదే మార్గంలో ప్రయాణించే అధికార యంత్రాంగం కూడా రోడ్డు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో కూడా ఆర్అండ్బీ రోడ్డు పలుచోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చిన్న చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి వేళ కొత్తగా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికి ఈ రహదారుల దుస్థితి మారుతుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.