తల్లికి వందనం పథకానికి మరో అవకాశం.. ఆగస్టు 3 వరకు ఫిర్యాదులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.
ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించనుండగా, ఆగస్టు 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో సాయం అందని వారు లేదా అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యార్థులతో పాటు, ఒకటో తరగతి మరియు జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆలోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.