తుమ్మగూడెం గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు
ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం తుమ్మగూడెం గ్రామంలో ప్రజల చిరకాల అవసరమైన ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణంతో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.
గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రధాన రహదారి నిర్మాణానికి సహకరించిన నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు మంజూరు నుంచి నిర్మాణ పనుల ప్రారంభం వరకు నిరంతరం కృషి చేసి, గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తుమ్మగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మందలపు రాజారావును గ్రామ ప్రజలు అభినందించారు.
మంత్రి కొలుసు పార్థసారథి చొరవ, మందలపు రాజారావు కృషితో తుమ్మగూడెం గ్రామానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన రహదారి కల సాకారమవుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.