తునికిపాడు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తిక్కన్న జయంతి, గురుపౌర్ణమి వేడుకలు
గంపలగూడెం, జూలై 30: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ ప్రాథమిక పాఠశాలలో గురువారం కవిబ్రహ్మ తిక్కన్న జయంతి, గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తిక్కన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయంలో రెండో కవిగా పేరొందిన తిక్కన్న, సంస్కృత వ్యాసభారతాన్ని తెలుగులో అనువదించే క్రమంలో నన్నయ్య పూర్తి చేయలేకపోయిన రచనను కొనసాగిస్తూ, అరణ్య పర్వంలోని శేష భాగాన్ని మినహాయించి మిగిలిన 15 పర్వాలను తెలుగులో రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని వక్తలు వివరించారు.
అనంతరం పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పరీక్షల ప్యాడ్లను పంపిణీ చేశారు.
గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు సంగెపు వెంకటేశ్వర్లు, ఆదూరి వెంకట నరసింహారావు, బోడేపూడి సమత, పిల్లి రవికుమార్, యలగందుల శ్రీనివాసరావులను శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు, పారేపల్లి వెంకట కృష్ణారావు, ఊటుకూరు యజ్ఞ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.