www.ntodaynews.com
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
తెలంగాణ
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క
చిట్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీలు
NTODAY NEWS: చిట్యాల
కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక బస్ స్టేషన్ నుంచి కనకదుర్గ ఆలయం వరకు రోడ్షో నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల అభ్యర్థన మేరకు చిట్యాల పట్టణానికి రైస్ మిల్లును తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల కోసం వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే 12 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను విడుదల చేసిందని, సమాఖ్య సంఘాలకు 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించామని వివరించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు, 250 కోట్ల రూపాయల పాత బకాయిలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన నిరుపేద మహిళలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తున్నామని, మహిళల కోసం 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఈ నెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలో 850 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల అవసరం ఉందని తెలిపారు. గత పదేళ్లలో పేదలకు సరైన గృహ కేటాయింపులు జరగలేదని విమర్శించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Chityala
#MunicipalElections2026
#CongressCampaign
#WomenEmpowerment
#IndirammaHousing
#InterestFreeLoans
#TelanganaPolitics
#PublicOutreach
#UrbanDevelopment
Follow us on
Website
Facebook
Instagram
YouTube