www.ntodaynews.com
స్థానిక సంస్థల్లో వేసిన అడుగు చాలా కీలకం
తెలంగాణ
దశాబ్దకాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది
NTODAY NEWS: కొండగట్టు -స్థానిక సంస్థల్లో వేసిన అడుగు చాలా కీలకం -పంచాయతీల నుంచి అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం -తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం -ఈ విజయం సరికొత్త మార్పుకు నాంది కావాలి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం అవసరం. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి మీరు చాలా పెద్ద అడుగు వేశారు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజు మీరు వేసిన అడుగు సరికొత్త మార్పుకు నాంది కావాలి” అన్నారు. పోటీ చేసిన స్థానాల్లో 50 శాతం విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొంటూ, జనసేన పార్టీ మద్దతుతో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా, ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్థులు మరియు బరిలోకి దిగిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్థికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. మరింతగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మొదలుపెట్టిన ప్రయాణం ఎంతో కీలకమైనది.
నాకు పార్టీ పెట్టడానికి చైతన్యం నింపింది తెలంగాణ నేలే. తెలంగాణ పోరాట స్ఫూర్తి నాకు ఎంతో ఇష్టం. నేను ఇక్కడి నుంచి ఏమీ ఆశించడం లేదు. మన దేశం, మన తెలుగు నేలకు జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవను కలసికట్టుగా చేద్దాం. తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడి ప్రజలకు అండగా నిలుద్దాం” అన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేద్దాం తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరమని, వారి స్థాయి మరియు ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయాలని సూచించారు. సిద్ధాంత బలంతో సహజంగా ఎదగాలని కోరుతూ, సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన వారిని విభేదించడం కష్టమని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నమైనవైనా, తెలంగాణ నేల తనకు పోరాట శక్తిని ఇచ్చిందని, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడగలిగిన కారణం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తేనని చెప్పారు. రజాకార్లపై సాగిన పోరాటం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 53 మంది విజయం సాధించారని, దశాబ్దకాలం తర్వాత తెలంగాణలో దక్కిన ఈ విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇన్చార్జ్, టీటీడీ ఎల్ఏసీ ఛైర్మన్ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు, టీటీడీ బోర్డు సభ్యుడు బి. మహేందర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఆర్.కె. సాగర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube