ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
అమరావతి, జూలై 30: పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'దీపం-2' పథకానికి మరో ముందడుగు పడింది. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.139.53 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఈ నిధులు ఆగస్టు–అక్టోబర్ త్రైమాసికానికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిర్ణీత సమయంలో సిలిండర్ అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న అనంతరం, ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు సమాచారం.