ఉద్యానవన పంటల సాగుకు కేంద్రం ప్రోత్సాహం రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, జూలై 28: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిన్న, సన్నకారు రైతులు ఉద్యానవన పంటల సాగు వైపు అడుగులు వేయాలని, రక్షిత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉద్యానవన పంటలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై లోక్సభలో ప్రశ్నించారు.
ఎంపీ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానమిస్తూ, సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్ (MIDH) కింద రైతులకు ఆర్థిక, సాంకేతిక సహాయం, రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్షిత సాగు విధానాలను విస్తరించేందుకు రాష్ట్ర ఉద్యానవన మిషన్లు, సాంకేతిక సహాయక బృందాలు, ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శిక్షణతో పాటు సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు.
అలాగే స్వచ్ఛ మొక్కల కార్యక్రమం, ఉద్యానవన క్లస్టర్ అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఉద్యానవన మండలి సంస్థాగత సహాయం అందిస్తోందన్నారు. ఇండో–ఇజ్రాయెల్, ఇండో–డచ్ భాగస్వామ్యంతో 61 పంటలకు ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.
పాలీహౌస్లు, షేడ్నెట్ హౌస్లు, ప్లాస్టిక్ టన్నెల్స్, వాక్–ఇన్ టన్నెల్స్ వంటి రక్షిత సాగు నిర్మాణాలకు కూడా MIDH కింద ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, పాలీహౌస్లు, షేడ్నెట్ హౌస్లను ఏర్పాటు చేసుకుంటే నీటి పొదుపుతో పాటు పంటల దిగుబడి, రైతుల ఆదాయం పెరుగుతాయని అన్నారు. సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగును కూడా విస్తరించడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చని రైతులకు సూచించారు.