వాల్టా చట్టం ప్రకారమే బోర్లు వేయాలి : తహశీల్దార్ విజయ్ కుమార్
వాల్టా చట్టం ప్రకారమే బోర్లు వేయాలి : తహశీల్దార్ విజయ్ కుమార్
చిట్యాల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు వాల్టా చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని చిట్యాల మండల తహశీల్దార్ విజయ్ కుమార్ సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని బోరుబండ్ల యజమానులతో తహశీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బోరుబండి యజమాని భూగర్భ జలాల శాఖకు రూ.1,000 చలానా చెల్లించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న బోరుబండ్లకు మాత్రమే బోర్లు వేసే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల భూముల్లో బోర్లు వేసే ముందు సంబంధిత రైతు వాల్టా చట్టం ప్రకారం ముందస్తు అనుమతులు పొందాడో లేదో బోరుబండి యజమానులు పరిశీలించాలని సూచించారు. అనుమతులు పొందిన భూముల్లో మాత్రమే బోర్లు వేయాలని, నిబంధనలు ఉల్లంఘించి బోర్లు వేస్తే సంబంధిత బోరుబండ్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిట్యాల మండల రైతులు కూడా బోర్లు వేయించుకునే ముందు సంబంధిత అధికారుల నుంచి వాల్టా చట్టం ప్రకారం అవసరమైన అన్ని అనుమతులు తప్పనిసరిగా పొందాలని తహశీల్దార్ సూచించారు. ఈ సమావేశంలో బోరుబండ్ల యజమానుల సంఘం మండల అధ్యక్షుడు ఇమ్మాడి వెంకన్నతో పాటు పలువురు బోరుబండ్ల యజమానులు పాల్గొన్నారు.