వేమిరెడ్డిపల్లిలో నెలరోజులుగా మంచినీటి కోసం ప్రజల అల్లాడింపు..
వేమిరెడ్డిపల్లిలో నెలరోజులుగా మంచినీటి కోసం ప్రజల అల్లాడింపు.. అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్న ఆగ్రహం
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం: వేమిరెడ్డిపల్లి గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఏడు శివారు గ్రామాలకు కేంద్రంగా ఉన్న ఈ పంచాయతీలో ఒకే తాగునీటి బోరు పాడవడంతో గ్రామస్తులు మంచినీటి కోసం వరి పొలాల వెంబడి బారులు తీరుతున్నారు. దశాబ్దాలుగా గ్రామానికి జీవనాధారంగా ఉన్న బోరును నెలరోజులైనా మరమ్మతు చేయకపోవడం అధికారుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గత 25 ఏళ్లుగా ఈ బోరు నీరే గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిందని, ఇప్పుడు మాత్రం మంచినీటి కోసం పొలాలు తిరిగి నీటిని మోసుకురావాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు చెడితే వారం రోజుల్లో బాగు చేయగలిగే పనిని నెలరోజులుగా పెండింగ్లో పెట్టడం ప్రజల పట్ల అధికారులకు ఉన్న నిర్లక్ష్య వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోనే తాగునీటి కోసం ప్రజలు అల్లాడాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004కు ముందు తీవ్ర కరువు వచ్చిన రోజుల్లో కూడా తాగునీటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు నీటి వనరులు ఉన్నా నిర్వహణ లోపంతో సమస్యలు ఎదుర్కోవడం దారుణమని అన్నారు. వెంటనే బోరును మరమ్మతు చేసి గ్రామానికి తాగునీరు అందించాలని, లేకపోతే మరో రెండు మూడు రోజుల్లో విస్సన్నపేటలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఎం విస్సన్నపేట మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు కనీస తాగునీరు అందించలేని పరిస్థితి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ధనలక్ష్మి, సీపీఎం నాయకుడు మోరంపూడి రామారావుతో కలిసి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు