వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు
తొలిరోజు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన ప్రముఖులు
భక్తులతో కిక్కిరిసిన ఘాట్లు.. పక్కాగా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక శోభతో, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు గురువారం ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగమ క్షేత్రంలో తొలి పుష్కర స్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ముందుగా పుణ్యస్నానాలు ఆచరించిన ప్రముఖులు:
ఈ పవిత్ర పుష్కర స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఆచరించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అలాగే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానంలో పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి."
కిక్కిరిసిన పుష్కర ఘాట్లు:
పుష్కరాల ప్రారంభ దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. "గోదావరి.. సరస్వతి" నామస్మరణతో సంగమ ప్రాంతం మారుమోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా, స్వచ్ఛంద సంస్థలు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారు.