వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు: మున్సిపల్ మేయర్ దర్ని మధుకర్
ఆండాలమ్మ కాలనీ ABC కేంద్రాన్ని పరిశీలించిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్
కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పరిశీలన
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల జనాభాను అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ఆండాలమ్మ కాలనీ డంప్ యార్డు వద్ద కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటి మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్లు కలిసి గురువారం సందర్శించి, కేంద్రం పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైటెక్ సిటీ ప్రాంతం నుండి తీసుకువచ్చిన వీధి కుక్కలకు వైద్యులు నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల విధానాన్ని మేయర్ స్వయంగా పరిశీలించి, అనంతరం వైద్య బృందంతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కలకు ఇక్కడ నిరంతరం ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా వాటి జనాభాను సమర్థవంతంగా అదుపులో ఉంచవచ్చని అధికారులు మేయర్కు వివరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రాజకుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు