మందగించిన నైరుతి రుతుపవనాలు..
రాబోయే రోజుల్లో పెరగనున్న ఎండలు, ఉక్కపోత
తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు కొంత మందగించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇవి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే విస్తరించి నిలిచిపోయాయి. రుతుపవనాల కదలికలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 18 తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి, కాస్త చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 19 నుండి 23 మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుని, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.