ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో చెన్నూరు ఆదర్శంగా నిలుస్తోంది
NTODAY NEWS:- చెన్నూరులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి గడ్డం వివేకానంద
చెన్నూర్, జూన్ 10: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారీలతో కలిసి 60 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అకాల వర్షాల సమయంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంతో పాటు ఆర్టీసీ బస్సుల నిర్వహణ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. చెన్నూర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించి, 23 మంది వైద్యులు, 10 పడకల ఐసీయూ, డయాలసిస్ కేంద్రం తదితర సౌకర్యాలతో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, సోలార్ హైమాస్ట్ లైట్లు, తాగునీటి పథకాలు, పోచమ్మ ఆలయ అభివృద్ధి, కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాళ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుతో విద్యార్థులు, యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏడాది వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం చెన్నూర్ మున్సిపాలిటీకి మంజూరైన చెత్త సేకరణ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.