పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా
పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా
ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్
చిలకలూరిపేట: గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేటలో ఏఐటీయూసీ, సివిల్ సప్లై, ఆటో యూనియన్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సి.హెచ్. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి ఆరాధ్యుల రామకృష్ణ అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు పేలూరి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీపీఐ పట్టణ మాజీ కార్యదర్శి నాయుడు శివకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో చమురు సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏఐటీయూసీ మాజీ కార్యదర్శి ఆరాధ్యుల రామకృష్ణ మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం కష్టతరంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని కోరారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి సంఘ నాయకుడు బొంత భగత్ సింగ్ విప్లవ గీతాలు ఆలపించి ప్రజలను చైతన్యపరిచారు.
కార్యక్రమంలో సీపీఐ మాజీ కార్యదర్శి నాగబైరు సుబ్బాయమ్మ, నాయకులు షేక్ ఖాదర్, గాత్రం భగత్ సింగ్, తన్నీరు వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై నాయకులు బొంత ఆదిబాబు, ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, మహిళా నాయకులు కె. వెంకాయమ్మ, డేరంగుల నాగేంద్రమ్మ, ఎడ్లపాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.