కేటీఆర్ను అంకుల్ అని సంబోధించిన ఎంపీ వంశీ.. 50వ జన్మదినం సందర్భంగా బర్త్డే ఛాలెంజ్
కేటీఆర్ను అంకుల్ అని సంబోధించిన ఎంపీ వంశీ.. 50వ జన్మదినం సందర్భంగా బర్త్డే ఛాలెంజ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంకుల్కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు ఓ ప్రత్యేకమైన 'బర్త్డే ఛాలెంజ్' విసిరారు. పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అంకుల్.. తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆ ఛాలెంజ్ను స్వీకరించి యువతకు ఉపాధి చూపిస్తే, సమాజానికి ఆయన అందించే ఉత్తమ బహుమతి అదే అవుతుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.
ఉపాధి కల్పనతో పాటు గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, గ్లోబరీనా సంస్థ వ్యవహారం కారణంగా నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామాల వల్ల తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేటీఆర్ అంకుల్ను కోరారు. ఆయా బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఎంపీ వంశీకృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేశారు