ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ గడువు 25 రోజులకు కుదింపు
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు ఉన్న 45 రోజుల గడువును 25 రోజులకు తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇకపై ఒకసారి సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజులు పూర్తయిన అనంతరం తదుపరి రీఫిల్ సిలిండర్ను బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు 45 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి ఊరట పొందనున్నారు.
అందరికీ ఒకే నిబంధన
కొత్త విధానం అమల్లోకి వస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహ వినియోగదారులకు 25 రోజుల బుకింగ్ వ్యవధి వర్తించనుంది. ప్రస్తుతం ప్రాంతాల ఆధారంగా ఉన్న వ్యత్యాసాలను తొలగించి, దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మార్పుతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగించే కుటుంబాలకు సిలిండర్ లభ్యత మరింత సులభతరం కానుంది. అయితే కొత్త నిబంధన అమలులోకి వచ్చే తేదీ, అధికారిక మార్గదర్శకాలను సంబంధిత శాఖ ప్రకటించాల్సి ఉంది.