చిట్యాల మున్సిపాలిటీలో ముమ్మరంగా 'ప్రజా పాలన' వార్డు సభలు
NTODAY NEWS:- నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా బుధవారం పలు వార్డులలో వార్డు సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత, కమిషనర్ యు. గురులింగం, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సభలలో ప్రజలు తమ వార్డుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వార్డుల వారీగా ప్రధాన సమస్యలు -
2వ వార్డు (కౌన్సిలర్: షబానా అజీమ్): బీరు సత్తయ్య ఇంటి సమీపంలోని పెద్ద డ్రైనేజీపై స్లాబ్ బిళ్లలు వేయాలని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు. లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి అదనంగా 2 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విద్యుత్ సమస్యను తీర్చాలని, డంపింగ్ యార్డ్ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమృత్ 2.0 కింద తాగునీరు అందించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
5వ వార్డు కౌన్సిలర్: జి. శ్రీలక్ష్మి వార్డులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంజూరు చేయాలని, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజలు కోరారు. డ్రైనేజీ, పైప్లైన్ సమస్యలను పరిష్కరించి, విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
7వ వార్డు కౌన్సిలర్: డి. లత ప్రజల సౌకర్యార్థం ఒక మినీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని, నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులను వేగవంతం చేయాలని కోరారు. PHCలో వైద్యుడిని నియమించాలని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, అంగన్వాడీ పాఠశాల కోసం స్థలం కేటాయించాలని విన్నవించారు.
8వ వార్డు కౌన్సిలర్: కుక్కల మోహన్ నూతనంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను తీర్చాలని ప్రజలు కోరారు. మైనారిటీ వర్గాల అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పోతరాజు కుంట (డంపింగ్ యార్డ్ ప్రాంతం)లో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి శుభ్రం చేయాలని కోరారు.
9వ వార్డు కౌన్సిలర్: ఎ. పరమేష్ అమృత్ 2.0 పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలని, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని, ప్రమాదకరంగా మారిన మునుగోటి అండాలు ఇంటి పైనున్న కరెంట్ వైర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
10వ వార్డు కౌన్సిలర్ ఎన్. శ్రీనివాస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెనుక డ్రైనేజీ సమస్యను తీర్చి సీసీ రోడ్డు వేయాలని, గోగికారి సారంగం ఇల్లు - ఎల్లమ్మ గుడి వరకు ఉన్న కాలువ సమస్యను పరిష్కరించాలని కోరారు. శంకరయ్య, వెంకటేశం రైస్ మిల్లుల కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని, శివాలయం నుండి శివనేని గూడెం వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలన్నారు. పెన్షన్ పంపిణీ సులభతరం చేసేందుకు ఇందిరానగర్, అంబేద్కర్ నగర్ లలో రెండేసి రోజుల చొప్పున పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ పాలకమండలి స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాల్లో కో-ఆప్షన్ సభ్యులు పి. అరుణాదేవి, షహజాది బేగం ఇబ్రహీం, ఇమ్రాన్, బి. సత్తయ్య, ఇతర కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.