ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు.
మదనపల్లె, ప్రజల భద్రత, సామాజిక చైతన్యమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, దాని దుర్వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 'శక్తి' యాప్ వంటి సాంకేతికతను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, మహిళలపై జరిగే అఘాయిత్యాల నిరోధానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, మైనర్ బాలికలకు వివాహాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. బాలలపై జరిగే లైంగిక దాడుల నివారణ చట్టం పోక్సో పై ప్రజలకు విపులంగా వివరించారు.
యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) అలవాటుకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి వ్యసనాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు, గ్రామాల రక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని, గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా నేరాలను అరికట్టవచ్చని, గ్రామాలు, పట్టణాల్లో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.