వికాస్ కళాశాల హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
వికాస్ కళాశాల హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఏప్రిల్ 7:
స్థానిక వికాస్ విద్యాసంస్థల హాస్టల్లో మంగళవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్ (20) ఇక్కడ డి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ఆవరణలోని హాస్టల్ మూడో అంతస్తులో ఉంటున్న కార్తీక్, తెల్లవారేసరికి తన గదిలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు.
నిద్రలేచిన తోటి విద్యార్థులు కార్తీక్ ఉరివేసుకోవడం చూసి నిర్ఘాంతపోయి, వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కళాశాల చైర్మన్ను వివరణ కోరగా, విద్యార్థి మృతి చెందడం బాధాకరమని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చేతికందివచ్చిన కొడుకు అకాల మరణంతో తాతకుంట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.