విసన్నపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసన ధర్నా
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా మూసివేసిన భారత్ పెట్రోల్ బంకు వద్ద సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొరత లేదని తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తోందని విమర్శించారు. వాస్తవానికి రైతులు, సాధారణ ప్రజలు ఇంధనం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎండ తీవ్రత మధ్య ప్రజలు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీజిల్ కొరతను ఆసరాగా తీసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని దుర్గం పుల్లారావు ఆరోపించారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా తక్షణమే సాధారణ స్థితికి తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వేముల బక్కయ్య, కళావతి, భవాని, సీతామాలక్ష్మి, చాట్ల బాబూరావు, భూతం మారయ్య, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.