విస్సన్నపేట మండలంలో అన్ని వర్గాలకు సమాధి స్థలాలు కేటాయించాలని డిమాండ్
విస్సన్నపేట మండలంలో అన్ని వర్గాలకు సమాధి స్థలాలు కేటాయించాలని డిమాండ్
విస్సన్నపేట మండలంలోని ప్రతి గ్రామంలో ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, వడ్రంగులు, కన్వర్టెడ్ హిందువులు తదితర వెనుకబడిన వర్గాల ప్రజలకు పార్థివ దేహాలను సమాధి చేయడానికి సరైన స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కెవిపిఎస్, సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాధి స్థలాలు లేక ప్రజలు వాగులు, వంకలు, చెరువుల వద్ద లేదా గ్రామాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో తమ బంధువుల పార్థివ దేహాలను ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా ప్రతి గ్రామంలో ప్రభుత్వం సమాధి దొడ్లు కేటాయించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెనుకబడిన వర్గాల బరియల గ్రౌండ్ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ హక్కుగా ప్రతి వర్గానికి గౌరవప్రదమైన సమాధి స్థలం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తక్షణమే విస్సన్నపేట మండలంలోని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నిధుల ద్వారా భూములు కొనుగోలు చేసి సమాధి స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ విస్సన్నపేట ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు మేకల జ్ఞానరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు విశ్వంపల్లి నాగరాజు, బడుగు భాస్కరరావు, కొండ భాస్కరరావు, మల్లాది రవి తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.