విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు డాబా శ్రీనివాసు, ఆకుల రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, షేక్ యాసిన్ రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.
అనంతరం మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎరువుల గ్రామసభ, ధర్తీ మాత బచావో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు.
నేల సారవంతంగా ఉంటే పండే పంటలు నాణ్యంగా ఉండటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. అలాగే యూరియా, డీఏపీ గుళికల బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచించారు.
నానో యూరియా ధర రూ.366 కాగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో రూ.249కే అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నానో ఎరువులను పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక శాతం పోషకాలను గ్రహించి, ఎరువుల వృథా తగ్గుతుందని వివరించారు.
మండలంలోని అన్ని సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్పీ ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రైతులందరూ ఏపీఎంఎస్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ-క్రాప్ నమోదు, ఎరువుల కొనుగోలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.