విస్సన్నపేటలో ఎమ్మెల్యే కొలికిపూడి సుడిగాలి పర్యటన అద్దె వ్యవసాయ యంత్రాల కేంద్రం ప్రారంభం – రైతులకు ఆధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి
విస్సన్నపేట, జూలై 28: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా విస్సన్నపేటలో అద్దె వ్యవసాయ యంత్రాల కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రతి రైతు ట్రాక్టర్, పవర్ టిల్లర్, హార్వెస్టర్ వంటి ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయడం సాధ్యం కాదని, అందుకే అద్దె యంత్రాల కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో యంత్రాలు అందించి వ్యవసాయ పనులు వేగంగా పూర్తిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
యాంత్రీకరణతో ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో పాటు కూలీలపై ఆధారపడటం తగ్గుతుందని, తక్కువ సమయంలో పనులు పూర్తై దిగుబడి, ఆదాయం పెరుగుతాయని పేర్కొన్నారు. యంత్రాలు కొనుగోలు చేయలేని రైతులకు అద్దెకు అందించడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరవేస్తున్నామని చెప్పారు.
అనంతరం తాతకుంట్ల గ్రామంలోని సమీకృత వ్యవసాయ క్లస్టర్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన జీవనోపాధి సేవా కేంద్రం (ఎల్ఎస్సీ) ప్రాధాన్యతను వివరించారు. అలాగే ఏటీఎం ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి, వారి సాగు విధానాలు, ఆదాయం, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, నీటి వనరుల అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాలు, రైతు అనుకూల పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.