విస్సన్నపేటలో సీపీఐ ప్రచార యాత్ర
విస్సన్నపేటలో సీపీఐ ప్రచార యాత్ర
- ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి.. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలి: సీపీఐ మండల కార్యదర్శి త్యాగరాజు
విస్సన్నపేట: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో మార్పు రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలు, ప్రచార యాత్రల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ఆదివారం ప్రచార యాత్ర నిర్వహించారు. సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ రైతాంగం, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు కార్మికుల హక్కులను పరిరక్షించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
దేశంలో సంపూర్ణ మార్పు కోసం సీపీఐ ప్రచార యాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై నిర్వహించే ఉద్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని త్యాగరాజు పిలుపునిచ్చారు.
విస్సన్నపేటతో పాటు తాతకుంట్ల, మారెమండ, నరసాపురం, కొండపర్వ, సండ్రుపట్ల తదితర గ్రామాల్లో కూడా ప్రచార యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కమిటీ సభ్యులు వేగి వెంకటేశ్వరరావు, పథకముడి నాగేశ్వరరావు, జుజ్జువరపు దానయ్య, ఒడిత్య కేశవ, పితాని నాగేశ్వరరావు, దంతనాల వెంకటేశ్వరరావు, నందికొల్ల రాజేష్, ఆకుల రాజు తదితరులు పాల్గొని ప్రచార యాత్రకు నాయకత్వం వహించారు.