విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు
విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలస సమీపంలో జరిగిన ఓ జాతరలో డ్యాన్స్ ఈవెంట్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత పండు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం రోడ్డుపై ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పండు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.