వంట ఏజెన్సీలకు మూడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలి సెప్టెంబర్ 12న విజయవాడలో భారీ ధర్నా చేపడతాం: డి. పుల్లారావు
చాట్రాయి: ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న వంట ఏజెన్సీలకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న మెనూ చార్జీలు, గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీటీయూ అనుబంధ స్కీం వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చాట్రాయిలో ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ మండల కార్యదర్శి బంటు పూజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వంట ఏజెన్సీలు అతి తక్కువ వేతనాలతో, ప్రభుత్వం అందిస్తున్న అరకొర మెనూ చార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పుల్లారావు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ పాలకులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మెనూ చార్జీలు, గౌరవ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 12న వందలాది మందితో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
స్కీమ్ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే స్మార్ట్ కిచెన్ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.26 వేల వేతనం చెల్లించాలని, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, ఏడాదిలో 12 నెలల వేతనాలు, గ్రాట్యుటీ, నెలకు రెండు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులను నిలిపివేయాలని కోరారు.
అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుకు, మండల విద్యాశాఖ అధికారి సహాయకుడు దారా దిలీప్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులు బి. పూజిత, పరికల కళావతి, మేకల కుమారి, ఎం. విజయకుమారి, మల్లేశ్వరి, బి. ఆనందరావు, ఎ. సుందరం, ఎస్కే హుస్సేన్, బి. మారయ్య తదితరులు పాల్గొన్నారు.