వర్షాల కోసం ముత్యాలమ్మకు 101 బిందెలతో జలాభిషేకం
వర్షాల కోసం ముత్యాలమ్మకు 101 బిందెలతో జలాభిషేకం
- సింగగూడెంలో భక్తిశ్రద్ధలతో మహిళల బోనాల ఊరేగింపు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో ఆదివారం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ ముత్యాలమ్మ అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.
గ్రామంలోని రామాలయం నుంచి మహిళలు బోనాలు, పసుపు, కుంకుమ, పండ్లు, ఫలహారాలతో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం జగనన్న కాలనీలో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చీర, సారెతో పాటు పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 బిందెలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు.