వర్షాలు కురవాలని పెనుగొలనులో నగర సంకీర్తన
పెనుగొలను, జూలై 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ఆదివారం భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు.
ఈ సందర్భంగా శిరిడి సాయిబాబాకు అభిషేకం చేసి నూతన వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సాయిబాబా ఆలయం నుంచి భగవన్నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డా. జి. నరసింహారావు, సుగల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
శనివారం రాత్రి గ్రామ బొడ్రాయి సెంటర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు బొలగాని నాగయ్య, కోట దాసు తెలిపారు.
ఈనెల 29న గురుపౌర్ణమి సందర్భంగా పెనుగొలను శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ తెలిపారు. గురువుల సన్మానం, సాయిబాబాకు దీపోత్సవం, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.