యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు
బాపట్ల జిల్లా | N Today News
యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై లైంగిక దాడి కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి వివరాలను బాపట్ల డీఎస్పీ సి.హెచ్. చంద్రమౌళి వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, ఒడిశా రాష్ట్రానికి చెందిన 36 ఏళ్ల మహిళ జీవనోపాధి కోసం తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివసిస్తూ కూలి పనులు చేస్తోంది. ఈ నెల 15న చిలకలూరిపేటలో కూలి పనుల కోసం వేచి ఉండగా, పని ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడు ఆమెను మోటార్ సైకిల్పై తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఆమె సెల్ఫోన్ను తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యద్దనపూడి పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మార్టూరు సీఐ బి. నాగభూషణం నేతృత్వంలోని పోలీసులు పర్చూరు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుడు కుంభా వెంకట్ (19) వద్ద నుంచి బాధితురాలి సెల్ఫోన్తో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు.
ప్రాథమిక విచారణలో నిందితుడిపై గతంలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా దొంగిలించబడినదేనని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
ఈ కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన డీఎస్పీ సి.హెచ్. చంద్రమౌళి, మార్టూరు సీఐ బి. నాగభూషణం, యద్దనపూడి ఎస్ఐ డి. రత్నకుమారి మరియు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు