గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జనసంద్రం.. కిలోమీటర్ మేర భక్తుల క్యూ!
అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి. శుక్రవారం ఊహించని రీతిలో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయం ముందు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జై కుళ్లాయి స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగగా, బ్రహ్మోత్సవాల సందడి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భద్రతతో పాటు తాగునీరు, క్యూలైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.