10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్
10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్
టెన్త్లో ఫలించిన వందరోజుల ప్రణాళిక
- విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ప్లానింగ్ సక్సెస్
- గతేడాది కంటే టెన్త్ పరీక్షల్లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం
- అన్ని యాజమాన్య పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు
- గతేడాది 81.1 శాతం ..ప్రస్తుతం 85.25 శాతం నమోదు
- బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత
- ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
- సున్నాశాతం ఫలితాలు ప్రైవేటు స్కూళ్లు 11.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 5
పూను స్పర్ధలు విద్యలందే-వైరములు వాణిజ్యమందే` అని ఎలుగెత్తి చాటిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారి మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ చేపట్టారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధన కోసం విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ ఒక ప్రణాళిక రూపొందించింది. ``వందరోజుల ప్రణాళిక``ను పకడ్బందీగా అమలు చేయడంతో టెన్త్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణతా శాతం మెరుగుపడింది.
100-రోజుల కార్యాచరణ ప్రణాళిక..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో టెన్త్ విద్యార్థుల కోసం రూపొందించిన 100-రోజుల కార్యాచరణ ప్రణాళికను 06-12-2025 నుండి 15-03-2026 పరీక్షల ఆరంభం అయ్యేవరకూ క్రమపద్ధతిలో అమలు చేశారు. ఈ కాలంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడిలేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో వచ్చిన మార్కులను LEAP మొబైల్ యాప్ లో పొందుపరిచారు. ప్రతిరోజూ 6 డ్యాష్బోర్డ్ల ద్వారా లీప్ యాప్లో మార్కులను విశ్లేషించారు.
షైనింగ్ స్టార్స్ .. రైజింగ్ స్టార్స్
స్లిప్ టెస్టులలో విద్యార్థుల సామర్థ్యాలను డ్యాష్ బోర్డు ద్వారా మదింపు చేసి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా విద్యార్థులను గుర్తించారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను తీర్చే పద్ధతిని అవలంబించారు.
సాధనే విజయం
"సాధనమున పనులు సమకూరు ధరలో`` అన్న వేమన మాట స్ఫూర్తిగా విద్యార్థులతో క్రమపద్ధతిలో చేయించిన సాధన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వీరి నిరంతర సాధన కోసం అవసరమైన మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులు విద్యాశాఖ ప్రచురించి ఉచితంగా అందించింది. వీటి ద్వారా విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేశారు. విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల సాధనకు నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (Bi-lingual) క్వశ్చన్ బ్యాంకులు, మిర్రర్-ఇమేజ్ రూపంలో (ఒక వైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్) ప్రచురించి అందించారు. వీటిని ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు మెరికల్లా తయారయ్యారు.
ఏ ఒక్క అవకాశం జారకుండా..
ఏ విద్యార్థి ఎందులో బలంగా ఉన్నారు, ఎందులో బలహీనంగా ఉన్నారో ముందుగానే డ్యాష్ బోర్డు విశ్లేషణ పూర్తయ్యింది. దీనికి అనుగుణంగా పాఠశాలకు ఒక సెట్ చొప్పున 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు.
స్లిప్ టెస్టులలో వెనుకబడిన (Drop-outs) విద్యార్థుల కోసం 30-రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నిర్వహించి, వారి పనితీరు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు.
విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు.
అమలు చేసిన పథకాలు ఇవీ..
ఇవి కాకుండా స్కూలులోనే విద్యార్థులకు మధ్యాహ్నం పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో యూనిఫాం, బెల్టు, బ్యాగు, షూ, డిక్షనరీ, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్నీ ఉచితంగా అందజేశారు. ఎంత మంది పిల్లలు చదివితే వారి తల్లికి ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందించిన సంక్షేమ పథకాలు ఒకవైపు..మరో వైపు కార్యాచరణ ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సమన్వయంగా సాగడంతో టెన్త్లో మంచి ఫలితాలు వచ్చాయి.
కృషికి తగ్గ ఫలితాలు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక-దాని అమలును నిరంతర పర్యవేక్షణ చేయడం, అధికారయంత్రాంగం అలుపెరుగని కృషి ఫలితంగా, మార్చి 2026 పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతమై 85.25 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో గతేడాది 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరిగింది.
భళా బాలిక
ఈ ఏడాది పరీక్షా ఫలితాల్లో బాలుర కంటే బాలికలు ఉత్తీర్ణతా శాతం ఎక్కువ సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.68శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 87.90శాతంగా ఫలితాల్లో తేలింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం మెరుగైన ఫలితాలను సాధించి భళా బాలిక అనిపించుకున్నారు.
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్న
రాష్ట్రంలో మొత్తం 12089 స్కూళ్లు ఉండగా, ఇందులో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 6785 , ఎయిడెడ్ స్కూళ్లు 260, ప్రైవేటు స్కూళ్లు 5044 ఉన్నాయి. వీటిలో సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు 16. వీటిలోనూ ప్రైవేట్ స్కూళ్లు 11 కాగా, 2 ఎయిడెడ్, 2 ఆశ్రమ పాఠశాలలు, 1 జిల్లా పరిషత్ హైస్కూల్ ఉంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చినవి కేవలం 5గా ఉండి ప్రభుత్వ విద్య నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇది అందరి విజయం అంటోన్న విద్యాశాఖా మంత్రి
ఐకమత్యంగా, అంకితభావంతో, ప్రణాళికాబద్ధంగా అంతా కలిసి పనిచేయడం వల్లనే టెన్త్లో మంచి ఫలితాలు సాధించామని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. మన ప్రణాళికలు విజయవంతమై మంచి మార్కులు వచ్చాయని, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, పిల్లల్లో నైతిక విలువలు పెంపు, సమగ్ర విద్యా వికాసానికి మరింత కృషి చేయాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి సమాజ సహకారం అవసరం అని పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పిల్లలు అందరికీ అభినందనలు తెలిపారు. ఫెయిలైన వారూ తక్కువ ప్రతిభ ఉన్నవారు కాదని, ఆత్మన్యూనతకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రయత్నమే తొలి విజయం అని, ఓటమి విజయానికి తొలి మెట్టు వంటిదని, పట్టుదలతో ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు.