22 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి: డివైఎఫ్ఐ
ఎన్టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శక పరీక్షా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్
నల్గొండలో మంగళవారం నిర్వహించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. National Testing Agency (ఎన్టీఏ) నిర్వహిస్తున్న నీట్ పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అవ్యవస్థలు, పేపర్ లీక్లు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
సంవత్సరాల పాటు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అప్పులు చేసి, నగలు అమ్మి తమ పిల్లలను చదివిస్తుంటే పరీక్షల నిర్వహణలో అవినీతి, భద్రతా లోపాలు వారి ఆశలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఎన్టీఏ నిర్వహించిన పలు పరీక్షలు లీకేజీలకు గురయ్యాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. వరుస వైఫల్యాలకు కారణమైన ఎన్టీఏను వెంటనే రద్దు చేసి, పారదర్శకతతో కూడిన కొత్త పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది.
అలాగే నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, పోకల శశిధర్, పాలది కార్తీక్, కండె యాదగిరి, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.