ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ క్రీడా పోటీలు
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ క్రీడా పోటీలు
చిట్యాల: మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ బాలుర హాస్టల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉరుమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, బహుమతులు, ప్రోత్సాహకాలను పల్లపు బుద్ధుడు అందజేశారు. ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ, టీమ్ వర్క్ పెరుగుతాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు దృఢ సంకల్పంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడా పోటీల్లో ప్రోత్సాహకాలు అందిస్తున్న పల్లపు బుద్ధుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, హాస్టల్ వార్డెన్ ప్రసాద్ శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్, ఎలిమినేటి హరిప్రసాద్రెడ్డి, మందుగుల పార్వతమ్మ, మర్రి పూలమ్మ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.