40 సార్లు అర్జీలు ఇచ్చినా భూ సమస్యకు పరిష్కారం లేదా..?
ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే భూ బాధితులతో కలిసి ఉద్యమం: సీపీఎం నేత వందవాసి నాగరాజు
తిరుపతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ వ్యవస్థలో ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాని పరిస్థితి నెలకొందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విమర్శించారు. శెట్టిపల్లి భూ బాధితులతో కలిసి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములు సేకరించినప్పటికీ, సంబంధిత లబ్ధిదారులకు వారి వాటా భూములకు సంబంధించిన ప్రొసీడింగ్స్ మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నాగరాజు ఆరోపించారు. ఈ సమస్యపై ఇప్పటికే సుమారు 40 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్ వేదికను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అయితే ఒకే సమస్యపై పదే పదే అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాకపోవడం వ్యవస్థ పనితీరుపై అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. ప్రజలు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సుబ్బమ్మ, గురునాథం, లక్ష్మయ్య, గురవ తదితరులకు సంబంధించిన భూముల విషయంలో 2019 ఫిబ్రవరి 15న తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ వెంకటరమణ అర్హులుగా గుర్తించి, ప్రొసీడింగ్స్ మంజూరుకు జిల్లా కలెక్టర్కు సిఫారసు చేశారని తెలిపారు. జీవో నంబర్ 173 ప్రకారం అర్హులైన అనుభవదారులకు ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఒక అధికారి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని చెబుతుండగా, మరో అధికారి మాత్రం కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించడం వల్ల బాధిత కుటుంబాలు అయోమయానికి గురవుతున్నాయని నాగరాజు పేర్కొన్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా జాప్యం కొనసాగితే భూ బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దాసరి జనార్ధన్, నగర కార్యదర్శి కే. వేణుగోపాల్, భూ బాధితులు పాల్గొన్నారు.