43 ఏళ్ల సేవలకు ముగింపు.. ఊటుకూరులో సీఈఓ వెంకట నర్సయ్యకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్)లో 43 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించిన సంఘ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) అనంత వెంకట నర్సయ్య గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఊటుకూరు పీఏసీఎస్ కళ్యాణ మండపంలో సంఘ పాలకవర్గం, సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు.
సభకు అధ్యక్షత వహించిన చైర్పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సహకార సంఘంలో దీర్ఘకాలంగా వివిధ బాధ్యతలు నిర్వహించిన వెంకట నర్సయ్య రైతులకు విశేష సేవలు అందించారని కొనియాడారు.
మాజీ తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ డీ. సీతారామ ప్రసాద్ మాట్లాడుతూ, పని గంటలతో సంబంధం లేకుండా రైతుల అవసరాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఎరువులు అందించిన వెంకట నర్సయ్య సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి, సీపీఐ సీనియర్ జిల్లా నాయకుడు పసుపులేటి వెంకయ్య, కాంగ్రెస్ నాయకుడు చెన్నుపాటి శేషగిరిరావు, వైఎస్సార్సీపీ నాయకులు ఆలపాటి ఉమామహేశ్వరరావు, కంభంపాటి బాబు, సీపీఎం మండల నాయకుడు వీరారెడ్డి, టీడీపీ నియోజకవర్గ నాయకులు కందిమళ్ల శేషగిరిరావు, డి. కృష్ణారావు, మానుకొండ రామకృష్ణ, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, బ్యాంకు అధికారులు, వివిధ గ్రామాల సహకార సంఘాల ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొని వెంకట నర్సయ్యకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు