చాట్రాయి మండలంలో ఘనంగా వీబీజీ రామ్జీ పనుల ప్రారంభం
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రామ్జీ) కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కావడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో చాట్రాయి మండలంలో కూడా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు, ఏపీఎం లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి గ్రామంలో వీబీజీ రామ్జీ పనులకు ప్రారంభోత్సవం చేశారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రజల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల్లో చెరువుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, పచ్చదనం పెంపు, తాగునీటి వసతుల మెరుగుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా స్థానిక కూలీలకు నిరంతర ఉపాధి లభించడంతో పాటు గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేశారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభం కావడం గ్రామీణాభివృద్ధికి మరో కీలక అడుగుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.