చాట్రాయిలో ఘనంగా 'వీబీజీరామ్జీ' పథకం ప్రారంభం.. గ్రామాభివృద్ధికి కూలీలే కీలకం : మోరంపూడి శ్రీనివాసరావు
ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో కొత్తగా అమలులోకి వచ్చిన వికసిత్ భారత్ గారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్జీ) పథకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు.
సూరన్న చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, నక్కా రాము, కందుల కృష్ణ, అంబుడ్స్మన్ బాజీ, నక్కా సీతారత్నం కొబ్బరికాయలు కొట్టి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలు ఉపాధి పొందడంతో పాటు గ్రామాల అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించవచ్చని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని కూలీలకు సూచించారు.
అంబుడ్స్మన్ బాజీ మాట్లాడుతూ.. టీఏ, ఎఫ్ఏలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి గరిష్ఠ వేతనాలు పొందాలని కూలీలకు సూచించారు.
మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ.. వీబీజీరామ్జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో టీఏ కృష్ణ, ఎఫ్ఏ తాతయ్యబాబు, సీనియర్ మెట్లు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.