ఆదానికి ఎఫ్సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు
ఆదానికి ఎఫ్సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు: డి. హరినాథ్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సైలో కాంట్రాక్టులను ఆదానీ గ్రూప్కు అప్పగించే చర్యలు దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
1964లో ఆమోదించిన ఫుడ్ కార్పొరేషన్ చట్టం ఆధారంగా 1965 జనవరి 1న ఎఫ్సీఐ ఏర్పాటైందని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీ, గిట్టుబాటు ధరల కల్పన, దేశ ఆహార భద్రత పరిరక్షణ వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తోందని వివరించారు.
ఎఫ్సీఐలో ఏకాధిపత్యాన్ని నిరోధించేందుకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించడం ద్వారా ఆదానీ గ్రూప్కు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. ఈ ప్రక్రియ 2022లోనే ప్రారంభమైందని, నీతి ఆయోగ్ మరియు ఆర్థిక వ్యవహారాల శాఖల ఒత్తిడితో కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న సైలో ప్రాజెక్టులలో భారీ భాగం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిందని, మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో 46.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని అవే నియంత్రిస్తున్నాయని తెలిపారు. ఇది 77.5 శాతం నియంత్రణకు సమానమని చెప్పారు.
దేశ ఆహార భద్రత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపే ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు వ్యతిరేకించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.