పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన
పోలవరం నిర్వాసితుల పునరావాసానికి భూముల పరిశీలన
జూలై 17: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస గృహాల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డీవో కుమార్ శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి భూములను పరిశీలించారు.
పునరావాస గృహాల నిర్మాణానికి సుమారు 100 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట సమీప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో, భూమి యజమానులైన రైతులతో సమావేశమై భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తే తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. భూముల అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెట్టగుట్ట సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటుతో జనాభా పెరిగి, అక్కడి శేషాచల శ్రీనివాస స్వామి ఆలయానికి కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.