పుంగనూరు బైపాస్ రోడ్డుపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన
పుంగనూరు బైపాస్ రోడ్డుపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన – తక్షణమే రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ డిమాండ్..
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు పట్టణ బైపాస్ రోడ్డు మృత్యుకుహరంగా మారుతోందని, నిత్యం జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు కాళ్లు, చేతులు విరిగి శాశ్వత వికలాంగులుగా మారుతుండటం అత్యంత బాధాకరమని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు స్థానికులను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బైపాస్ జంక్షన్ల వద్ద కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, సరైన బ్లింకర్ లైట్లు మరియు రాత్రి వేళల్లో వీధి దీపాల వెలుతురు లేకపోవడమే ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ..
"అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేసి, తక్షణమే స్పందించాలి.
నిత్యం రద్దీగా ఉండే ఈ బైపాస్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలి.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే కీలక జంక్షన్ల వద్ద తక్షణమే శాస్త్రీయంగా స్పీడ్ బ్రేకర్లను (Speed Breakers) ఏర్పాటు చేయాలి అని అన్నారు.
వాహనదారులను అప్రమత్తం చేసేలా స్పష్టమైన సైన్ బోర్డులు, రిఫ్లెక్టర్లు అమర్చాలి.
రాత్రి సమయాల్లో ప్రయాణాలు సురక్షితంగా సాగేలా హైమాస్ట్ లైట్లు, వీధి దీపాలను పునరుద్ధరించాలి.
ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) మరియు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలి."
ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, జాతీయ రహదారుల అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజల ప్రాణాల రక్షణ కోసం స్థానిక ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ హెచ్చరించారు.