ఈ నెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి
ఈ నెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి
- వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
- గడువు దాటితే రేషన్ పంపిణీలో ఇబ్బందులు తప్పవు
- వెల్లడించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు
మంచిర్యాల: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల రేషన్ షాపు డీలర్ల సంఘం ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు, నకిలీలను ఏరివేసి అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ రాయితీలు నిరంతరాయంగా అందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిందన్నారు. జిల్లాలో ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వంద శాతం నమోదు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు స్వయంగా తమ పరిధిలోని లేదా సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి, ఈ-పాస్ (e-POS) యంత్రంలో వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ నమోదు పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ సరుకుల పంపిణీ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. కావున కార్డుదారులందరూ వెంటనే స్పందించి ఈ-కేవైసీని పూర్తి చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్ల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు