కార్మికులందరికీ రూ. 26 వేల కనీస వేతనం చెల్లించాలి
కార్మికులందరికీ రూ. 26 వేల కనీస వేతనం చెల్లించాలి
- మున్సిపల్ కార్మికుల వేతనాల కోతను వెనక్కి తీసుకోవాలి
- నిరుపేద కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
- 55 ఏళ్లు పైబడిన వారికి రూ. 3 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, రూ. 6 వేల పెన్షన్
- కలెక్టరేట్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు సీఐటీయూ వినతిపత్రం అందజేత
మంచిర్యాల :జిల్లాలోని అసంఘటిత, సంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్, స్కీం వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులందరికీ నెలకు రూ. 26 వేల కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రతతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 55 ఏళ్లు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ. 3 లక్షలు, నెలకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఇన్నాళ్లూ కార్మికులకు ఇచ్చిన పెరిగిన జీతాన్ని తిరిగి చెల్లించమనడం దారుణమని, వేతనాలు తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సొంత ఇల్లు, స్థలం లేని నిరుపేద ఉద్యోగ, కార్మికులందరికీ ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు, పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసీ, గిరిజన రైతులందరికీ భూ పట్టాలు పంపిణీ చేయాలని కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కాసల రాజలింగు, ఉద్యోగ, కార్మిక నాయకులు మహేందర్, తిరుపతి, దేవావరం, రమేష్ తదితరులు పాల్గొన్నారు